సానియా మీర్జాకు ప్రధాని  మోదీ లేఖ

సానియా మీర్జాకు ప్రధాని  మోదీ లేఖ
PM Modi letter to Sania Mirza

ఇటీవల కెరీర్ కు వీడ్కోలు ప్రకటించిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుత కెరీర్ ను ముగించిన సానియాను అభినందిస్తూ మోదీ రెండు పేజీల లేఖ రాశారు. చాంపియన్ సానియా అంటూ రాసిన మోదీ.. భారత క్రీడారంగంపై ఆమె చెరగని ముద్ర వేసిందంటూ కితాబిచ్చారు. రాబోయే తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడారు.  ‘ఇకపై మీరు టెన్నిస్‌ ఆడటం లేదని అభిమానులు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు ఆడటం ప్రారంభించినప్పుడు దేశంలో టెన్నిస్‌ చాలా భిన్నంగా ఉంది. ఎక్కువ మంది మహిళలు టెన్నిస్‌లోకి వచ్చి రాణించగలరని మీరు మీ ఆటతో నిరూపించారు.

ఆటలను కెరీర్‌గా తీసుకోవాలనుకునే ప్రతీ మహిళకు మీరు సాధించిన విజయం చాలా బలాన్ని ఇచ్చింది. మీ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపింది. జనవరి 13న మీ కెరీర్ కి సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. అప్పుడు ఆరేళ్ల చిన్నారి నుంచి ప్రపంచ స్థాయి టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఎదిగిన మీ ప్రయాణాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు. దేశానికి పతకాలు సాధించడం మీకెంతో గౌరవం అని పేర్కొన్నారు. కానీ మీరు భారత దేశానికి గర్వకారణమని నేను చెప్పగలను’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశాన్ని సానియా తన ట్విటర్ లో షేర్ చేసింది. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. దేశం గర్వపడేలా చేసేందుకు కృషి చేస్తూనే ఉంటానని చెప్పింది.