ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు చుక్కెదురు
![ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు చుక్కెదురు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6426cb29cee9d.jpg)
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్ట్ నిరాకరించింది. ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సిసోడియా అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సిసోడియాను సీబీఐ రిమాండ్ కు పంపిన రౌస్ అవెన్యూ కోర్టు.. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీటీవీ కవరేజ్ ఉన్న చోట నిందితుల విచారణ జరగాలని, ఆ ఫుటేజీని సీబీఐ భద్రపరచాలని ఆదేశించింది. నిందితుడు గతంలో రెండుసార్లు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాడని, అయితే విచారణలో అడిగిన చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను న్యాయబద్ధంగా వివరించడంలో విఫలమయ్యాడని ట్రయల్ కోర్టు పేర్కొంది.
తరువాత రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. ఇదిలావుండగా.. లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సిసోడియా తరచూ ఫోన్లు మార్చారని న్యాయస్థానానికి తెలిపింది సీబీఐ. ఇది ఆయన అమాయకత్వం కాదని స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఇంకా 60 రోజుల సమయం వుందని.. అప్పటి వరకు సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని గతంలో జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు విజ్ఙప్తి చేసింది సీబీఐ. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం వుందని, ఢిల్లీ కోర్టుకు తెలిపింది సీబీఐ.