హౌరాలో హింసాకాండ వెనుక బీజేపీ హస్తం

హౌరాలో హింసాకాండ వెనుక బీజేపీ హస్తం

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వాహనాలను తగులబెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. అయితే ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. హౌరాలో చోటు చేసుకున్న హింసాకాండకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇతర మితవాద సంస్థలే కారణమని ఆమె అన్నారు. ఈ అల్లర్లలో ఆస్తులు కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ ప్రాంతంలో శాంతిని కాపాడాలని మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ‘‘హౌరా ఘటన చాలా దురదృష్టకరం. హౌరాలో జరిగిన హింసాకాండ వెనుక హిందువులు, ముస్లింలు లేరు.

బీజేపీతో పాటు భజరంగ్ దళ్, ఇతర సంస్థలు ఆయుధాలతో హింసకు పాల్పడుతున్నాయి’’ అని మమతా బెనర్జీ  అన్నారు. హౌరాలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 31 మందిని అరెస్టు చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఘటనలకు అడ్మినిస్ట్రేటివ్ లోని ఓ విభాగం అలసత్వమే కారణమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు.

హింసాకాండకు ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని అధికారి అన్నారు.  కాగా.. శ్రీరామనవమి రోజున మహారాష్ట్ర, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదు వెలుపల మ్యూజిక్ సిస్టంలో పాటలు పెట్టడంతో ఇక్కడ ఘర్షణ నెలకొంది. ఇది తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.