తల్లిని హతమార్చిన తనయుడు

తల్లిని హతమార్చిన తనయుడు

ముద్ర ప్రతినిధి, మెదక్:మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన హవెలి ఘనపూర్ మండలంలోని తొగిటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ ఆనంద్ గౌడ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన పుస్తి నర్సమ్మ(45)కు కుమారులు భానుప్రసాద్, బాలు ఉన్నారు. ఒక కుమారుడు, భర్త మరణించారు. నర్సమ్మ వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో భానుప్రసాద్ గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని తల్లిని కోరాడు.  ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది.

తల్లి కొడవలితో కుమారుడిపై దాడి చేసేందుకు యత్నించింది. ఇంట్లోని మరో కత్తితో భానుప్రసాద్ తల్లిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న హవెలి ఘనపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని  రిమాండ్ కు పంపుతున్నట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. అయిదేళ్ల క్రితం భానుప్రసాద్ తో కలిసి నర్సమ్మ తన తల్లి బాలమణిని ఆస్తి కోసం దాబాపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో జైలుకెళ్లి బయటకొచ్చిన విషయం తెలిసిందే. తొగిటలో విషాదం అలుముకుంది.