రేపు భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

రేపు భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌట్ కాగా... మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 18, కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.  ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో, రేపు మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ సత్తాకు పరీక్ష ఎదురుకానుంది.

ఈ మ్యాచ్ లో పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా మారాలంటే కనీసం ఒకటిన్నర రోజయినా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితికి చేరడం పెద్ద కష్టమేం కాదు.  నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి టెస్టును డ్రా చేసుకున్నా చాలు... సిరీస్ భారత్ వశమవుతుంది.