విశాఖ వన్డేలో ఆసీస్‌ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!

విశాఖ వన్డేలో ఆసీస్‌ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!

ఆస్ట్రేలియా పేస్‌ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమ్‌ఇండియా కష్టపడిన పిచ్‌పైనే ఆసీస్‌ విశ్వరూపం చూపించింది. రోహిత్‌ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్‌ పడకుండా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (51*), మార్ష్‌ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసి టైటిల్‌ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌ సిరీస్‌ విజేతను తేల్చనుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 117 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌, సీన్‌ అబాట్‌, ఎల్లీస్‌ పేస్‌ అటాక్‌ ముందు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెలవెలబోయింది. విరాట్‌ కోహ్లీ (31), అక్షర్‌ పటేల్‌ (29) ఆ కాస్త రాణించడంతో.. భారత్‌ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. శుబ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 5 వికెట్లతో విజృంభించగా.. సీన్‌ అబాట్‌ 3, ఎల్లీస్‌ 2 వికెట్లు పడగొట్టాడు.