నేడు శ్రీలంక  ..  పాక్ ల మధ్య మ్యాచ్​ 

నేడు శ్రీలంక  ..  పాక్ ల మధ్య మ్యాచ్​ 
  • భారత్ ..  పాకిస్థాన్  ఫైనల్స్ ఆడాలంటే 
  • పాకిస్ధాన్​ లంకపై గెలవాలి .. అభిమానుల ఉత్కంఠ 

కొలంబో: ఆసియా కప్ 2023లో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్ 4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. మిగత జట్ల కంటే ముందుగానే ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం టీమిండియా రన్‌రేటు కూడా +2.690గా ఉంది. దీంతో మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత జట్టు ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఏదనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే మెజారిటీ క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్థాన్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనేది వారి కోరిక. అయితే ఇది జరగాలంటే పాకిస్థాన్ కూడా ఫైనల్ చేరాలి. అందుకు అతిథ్య జట్టుతో శ్రీలంకతో గురువారం జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవాల్సి ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో వరుసగా రెండు విజయాలతో 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్న టీమిండియా టాప్‌లో ఉంది. 

ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఖాతాలో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఆ జట్టు టీమిండియా తర్వాత రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ కూడా ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడినప్పటికీ మూడో స్థానంలో ఉంది. ఎందుకంటే పాక్ రన్ రేట్ శ్రీలంక కంటే తక్కువగా ఉంది. శ్రీలంక రన్ రేటు -0.200గా ఉండగా.. పాకిస్థాన్ రన్ రేటు -1.892గా ఉంది. ఇక సూపర్ 4లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో భారత్‌తో ఫైనల్ ఆడే అవకాశం పాకిస్థాన్, శ్రీలంకకు మాత్రమే ఉంది. ఈ రెండు జట్ల మధ్యనే గురువారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఫైనల్ చేరుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంకను వారి సొంత గడ్డపై ఓడించడం పాకిస్థాన్‌కు అంత సులువు కాదు. పైగా ఆ జట్టు స్టార్ బౌలర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా భారత్‌తో మ్యాచ్‌లో గాయపడ్డారు. దీంతో వారు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఆడతారా ? లేదా ? అనే దానిపై స్పష్టత లేదు. వారిద్దరు దూరమైతే లంకను ఓడించడం పాక్‌కు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ప్రకారం శ్రీలంకనే ఫైనల్ చేరుతుంది. పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. దీంతో పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా శ్రీలంకపై గెలవాల్సిందే. దీంతో గురువారం జరిగే శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక సూపర్ 4లో భారత్ తమ చివరి మ్యాచ్‌ను శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇప్పటికే టీమిండియా ఫైనల్ చేరగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి లాభం కానీ, నష్టం కానీ ఉండదు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. సీనియర్లకు విశ్రాంతినిచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొచ్చు.