‘దేశంలో అత్యుత్తమ పోలీసింగ్‌ మనదే

‘దేశంలో అత్యుత్తమ పోలీసింగ్‌ మనదే
  • ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థతో ప్రజలకు అందుబాటులో సేవలు
  • మాదాపూర్ జోన్ లో నూతనంగా కొల్లూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
  • తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి తన్నీరు శ్రీ హరీశ్ రావు గారు అన్నారు.   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మాదాపూర్ జోన్ మియాపూర్ డివిజన్ లోని కొల్లూరు లో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు  హరీశ్ రావు, పటాన్చెరు శాసనసభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు  శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ పోలీసులకు 2014 తరువాత అత్యాధునిక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పోలీసు యంత్రాంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి ఆధునీకరించారన్నారు. ఆధునిక పోలీసు భవనాలు, వాహనాలు, కొత్త టెక్నాలజీ పరికరాలు సమకూర్చడంతో రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని, శాంతిభద్రతలు నెలకొన్నాయని అన్నారు.
 ఏ రాష్ట్రంలోనైతే శాంతిభద్రతలు బాగుంటాయో,  అక్కడ అత్యధికంగా పెట్టుబడులు వస్తాయని తద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ/ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థతో ప్రజలకు అందుబాటులో పోలిసింగ్ ఉందన్నారు. నేరాల నియంత్రణకు పోలీసింగ్‌ సేవలకు ఆధునికతను జోడించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

ఇప్పటివరకూ కొల్లూరు ప్రాంతం ఆర్ సిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉందని,  కొల్లూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 25వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లోకి సుమారు రెండు లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో కొల్లూరు నూతన పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు.  

ఈ కార్యక్రమంలో  మాదాపూర్ డిసిపి  శిల్పవల్లి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ  నంద్యాల నరసింహారెడ్డి,  సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి,   పటాన్చెరు ఎమ్మార్వో జయరాజ్, మియాపూర్ ఏసిపి శ్రీ నరసింహారావు, కొల్లూరు ఇన్ స్పెక్టర్ టి సంజీవ్ కుమార్,  తెల్లాపూర్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్  బి రాములు గౌడ్  తదితరులు పాల్గొన్నారు.