విశాఖలో   కూలిన భవనం... అన్నాచెల్లెలు మృతి

విశాఖలో   కూలిన భవనం... అన్నాచెల్లెలు మృతి

విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.  తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు.  బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి బాలిక సాకేటి అంజలి(14), ఆమె సోదరుడు దుర్గాప్రసాద్‌(17) మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు.