మార్ఫింగ్​ దారుణం

మార్ఫింగ్​ దారుణం
  • రేవంత్​రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దారుణమని, ఈ చర్య దేశ భద్రతకు సంబంధించిన అంశమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే  కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, మురుగన్ సమక్షంలో పెద్దపల్లి సిట్టింగ్  ఎంపీ వెంకటేశ్​ నేతకాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. సీఎం స్థాయిని రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారని ఆరోపించారు. 

రేవంత్​ విశ్వసనీయతను కోల్పోయారు..
రిజర్వేషన్ల ఆరోపణలతో ఆయన తన విశ్వనీయత కోల్పోయారని కిషన్​ రెడ్డి అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, ప్రతిపక్షనేతగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజలకు పట్టిన ఖర్మ అని అన్నారు. కృష్ణా జలాల వాటాల్లో 299 టీఎంసీలపై సంతకం పెట్టింది కేసీఆర్ కాదా?  అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో హంగ్ వస్తుంది.. చక్రం తిప్పుతానని కేసీఆర్ కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్.. ఢిల్లీలో చక్రం తిప్పుతానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తారు.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కాంగ్రెస్, బీజేపీ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు తీసివేసేది లేదని ఆర్ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.