మోడీపై అనర్హత పిటిషన్ - తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
- పిటిషనర్ వాదనలో పస లేదన్న ధర్మాసనం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆరేళ్లపాటు అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పిటిషన్ ఏమాత్రం విచారణకు అర్హమైనది కాదంటూ తీర్పునిచ్చింది. ప్రధాన మంత్రి ఇటీవల ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘భగవంతుడు, ఆరాధనా స్థలాలు’ పేరుతో ఓట్లు అడిగారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషనర్ వాదించారు.
అయితే.. ఈ వాదనలో పసలేదని, విచారణకు యోగ్యం కాదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. పిటిషనర్ అభ్యర్థన ఇంకా ఎన్నికల కమిషనల్ పరిశీలనలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడినట్టు ముందుగానే పిటిషనర్ ఒక నిర్ణయానికి రావడం పూర్తిగా అనుచితమని కోర్టు అభిప్రాయపడింది. ఏవిధంగా చూసినా పిటిషన్ విచారణకు యోగ్యంగా లేదని కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది.