భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
![భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f9fbfb359e6.jpg)
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తీసుకురావడానికి తాను, ప్రధాని నరేంద్ర మోడీ అంకితభావంతో పని చేస్తున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం అని, తాను ఇందులో వ్యక్తిగతంగా పాల్గొంటానని తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం స్కోల్జ్ శనివారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ భారతదేశం అపారమైన పురోభివృద్ధి సాధించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇది చాలా మంచిది.
నేను గతసారి భారతదేశాన్ని సందర్శించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చింది. భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతోంది. నాకు, ప్రధాని మోడీకి ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. మేము సహకరించుకున్నాం. అనేక విషయాలపై చర్చిస్తున్నాం. ఈ ఏడాది భారత్ కు జీ20 అధ్యక్ష పదవి దక్కడం సంతోషంగా ఉంది’’ అని స్కోల్జ్ పేర్కొన్నారు. 25,26 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఆయన శనివారం భారత్ కు చేరుకున్నారు. 2011లో ఇరు దేశాల మధ్య Intergovernmental Consultation (IGC) ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ (ఐజీసీ) విధానం ప్రారంభమైన తర్వాత జర్మన్ చాన్స్ లర్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ తొలి వార్షికోత్సవం జరిగిన మరుసటి రోజే మోడీని స్కోల్జ్ కలిశారు.