పాత కక్షలతో ఒకరి హత్య

పాత కక్షలతో ఒకరి హత్య

ముద్ర ప్రతినిధి, మెదక్ (పెద్ద శంకరంపేట): పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బాలరాజు కథనం ప్రకారం మండలంలోని బద్దారం గ్రామానికి చెందిన గాజు రవీందర్ (38) లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పెద్ద శంకరంపేటకు వచ్చిన గాజు రవీందర్  రాత్రి ఆటోలో స్వగ్రామానికి ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మల్కాపురం శివారులో కాపు కాసి అతనిపై గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చి బద్దారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పడేశారు.

వెంట ఉన్న గ్రామస్థులు అక్కడి నుంచి పారిపోయారు. విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి మెదక్ డీఎస్పీ సైదులు, అలాదురం సీఐ జార్జి, పేట ఎస్ఐ బాలరాజు, సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ సందర్శన బద్దారం గ్రామాన్ని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించారు. హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం బద్దారం గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి అక్కడి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా బుధవారం రాత్రి మృతిని వెంట ఆటోలో ప్రయాణిస్తున్న దొబ్బ భూమయ్యకు సైతం తీవ్ర గాయాలు కావడంతో అతన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంట ఉన్న మరో వ్యక్తి ప్రభాకర్ పరారీలో ఉన్నారు. ఎస్ పీ వెంట మెదక్ డిఎస్పి సైదులు, అల్లాదుర్గం సిఐ జార్జ్, పేట ఎస్సై బాలరాజ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.