డేటా చోరీ కేసు నిందితుడు వినయ్ భరద్వాజ అరెస్ట్

డేటా చోరీ కేసు నిందితుడు వినయ్ భరద్వాజ అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో కీలక పురోగతి కనిపించింది. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు  శనివారం  అరెస్ట్ చేశారు. అతడి నుంచి 2 ల్యాప్ టాప్ లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది వివరాలు ఉన్నట్టు గుర్తించారు. నిందితుడు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల డేటాను 'ఇన్ స్పైర్ వెబ్స్' అనే వెబ్ సైట్ ద్వారా విక్రయించాడు.

వినయ్ భరద్వాజ జీఎస్టీ, పాన్ కార్డ్, యూట్యూబ్, ఫోన్ పే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, అప్ స్టాక్స్,  బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, వేదాంత, బుక్ మై షో, బైజూస్ నుంచి డేటా తస్కరించాడు.  24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటన్ నగరాలకు చెందినవారి డేటా చోరీ చేశాడు. కాగా, ఈ ముఠా ఏపీకి చెందిన 2.1 కోట్ల మంది నుంచి డేటా చోరీ చేసినట్టు వెల్లడైంది. హైదరాబాద్ కు చెందిన 56 లక్షల మంది డేటా కూడా ఈ ముఠా వద్ద ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 21.39 కోట్ల మంది డేటా చోరీకి గురైంది.