శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో పిహెచ్‌డి స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో పిహెచ్‌డి స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

అనంతపురం:  రాయలసీమలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.   ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం శేషానుపల్లి గ్రామానికి చెందిన అంజి ఉన్నత విద్యావంతుడు. మ్యాథ్స్ లో ఎమ్మెస్సీ పూర్తిచేసిన అతడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తున్నాడు. ఏమయ్యిందో తెలీదుగానీ వసతి గృహంలోని తన గదిలో ఒంటరిగా వున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అంజి. తోటి స్టూడెంట్స్ సకాలంలో గుర్తించి అంజిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అంజి ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హాస్పిటల్ కు చేరుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.  ఉన్నతచదువులు చదువుతూ చేతికందివచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావుబ్రతుకులతో పోరాడటం చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎలాగయినా తమ బిడ్డను కాపాడాలంటూ డాక్టర్లను వేడుకుంటున్నారు. పరిశోధక విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.