‘తీన్’మార్
విజయం దిశగా దూసుకుపోతున్న కమలం
ముద్ర సెంట్రల్ డెస్క్: మూడు రాష్ర్టాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో హస్తం హవా కొనసాగుతుందనుకున్నా, కమలం వికసించే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో విజయం దిశగా బీజేపీ (తీన్మార్) దూసుకుపోతోంది. ఛత్తీస్గఢ్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్లో ఉదయం 12 గంటల వరకు 155 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 71 స్థానాల్లో, రాజస్థాన్లో 116, కాంగ్రెస్ 62, ఛత్తీస్గఢ్ బీజేపీ 48, కాంగ్రెస్ 40 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. నిమిష నిమిషానికి స్థానాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నా మెజార్టీ స్థానాల్లో విజయం దిశగా కమలం దూసుకుపోతోంది. మూడు రాష్ర్టాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మేనియా పనిచేసిందనే చెప్పాలి. నిన్నమొన్నటివరకూ కూడా పలు సర్వేల్లో హస్తానికే మెజార్టీ సీట్లు దక్కేలా ఉన్నా, ఆ సర్వేలు కాస్త తారుమారయ్యాయి. మూడు రాష్ర్టాల ప్రజలు బీజేపీకే జై కొట్టారు.
మధ్యప్రదేశ్లో కమలం ముందంజ
ఎంపీలో 230 స్థానాలకు గాను విజయం కోసం 116 స్థానాలు కైవసం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీలోని పలువురు దిగ్గజ నేతలు ముందంజలో ఉన్నారు. బుధాని నుంచి సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ (ముందంజ–బీజేపీ), చించ్వాడా నుంచి కమల్నాథ్ (ముందంజ–కాంగ్రెస్), దిమానీ నుంచి నరేంద్రసింగ్ తోమర్ (ముందంజ–బీజేపీ), ఇండోర్–1 కైలాష్ విజయ్వర్గీయ్ (ముందంజ–బీజేపీ), నరసింహ్పూర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ (ముందంజ–బీజేపీ), రాయ్గఢ్ జయవర్ధన్ సింగ్ (ముందంజ–కాంగ్రెస్), దతియా నుంచి నరోత్తమ్ మిశ్రా (ముందంజ–బీజేపీ), రాహు నుంచి జీతూ పట్వారీ (ముందంజ –కాంగ్రెస్) అభ్యర్థులున్నారు. అత్యంత ప్రాముఖ్యం ఉన్న స్థానాల్లో 8 స్థానాలున్నాయి.
రాజస్థాన్ హాట్సీట్లు
రాజస్థాన్లో 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ హాట్సీట్లుగా తొమ్మిది స్థానాలున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ స్థానాల్లో ముందంజలో ఉన్న అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు. సర్ధార్పూరా నుంచి సీఎం అశోక్ గెహ్లత్ (కాంగ్రెస్), జాలరాపటాన్ నుంచి వసుంధరా రాజే సింధియా (బీజేపీ), టోంక్ నుంచి సచిన్ పైలెట్ (కాంగ్రెస్), జోట్వాడా నుంచి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (బీజేపీ), విదాదర్నగర్ నుంచి దియా కుమారి (బీజేపీ–జైపూర్ రాజకుటుంబం), నథ్ద్వారా సీ.పీ. జోషి (కాంగ్రెస్), తారానగర్ రాజేంద్ర రాథోడ్ (బీజేపీ), తిజారా నుంచి బాబా బాలక్నాథ్ (బీజేపీ), లక్ష్మణ్గఢ్ నుంచి గోవింద్ సింగ్ డోటాసారా (కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు.
ఛత్తీస్గఢ్లోనూ కమలం హవా..
మావోయిస్టు ప్రభావిత రాష్ర్టమైన ఛత్తీస్గఢ్లోనూ బీజేపీ హవా కొనసాగిస్తుంది. మొత్తం 90 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 46. ఆరు స్థానాలు హాట్సీట్లుగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ముందంజలో ఉన్న అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు. పాటన్ సీఎం భూపేశ్ బాగేల్ (కాంగ్రెస్), రాజనంద్గావ్ రమన్సింగ్ (బీజేపీ సీఎం అభ్యర్థి), అంబికాపూర్ టీఎస్ సింహ్ దేవ్ (కాంగ్రెస్), రాయ్పూర్ నగర్ దక్షిణ బ్రిజ్మోహన్ అగ్రవాల్ (బీజేపీ), దుర్గ్ రూరల్, తామ్రధ్వజ్ సాహు (కాంగ్రెస్), సత్రు చరణ్దాస్ మహంత్ (కాంగ్రెస్).