కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి.. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రీతి నిరసనగా ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. కేఎంసీ వద్దకు భారీగా చేరుకున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాగింగ్, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ పీజీ మెడికల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల బంద్కు ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రీతి మరణానికి కారణమైన నిందితులతో పాటు, సంబంధిత కళాశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.