స్కాట్లాండ్లో విషాద ఘటన.. జలపాతంలో మునిగి ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి...!
ముద్ర,సెంట్రల్ డెస్క్:- స్కాట్లాండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ సందర్శనా స్థలంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు బుధవారం నీటిలో శవమై కనిపించారు. గ్యారీ, తుమ్మెల్ నదులు కలిసే పెర్త్షైర్లోని పిట్లోచ్రీకి వాయువ్యంగా ఉన్న లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
డూండీ యూనివర్సిటీలోని విద్యార్థులు విహార యాత్రకు వెళ్లగా వారిలో నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేశారు. ఆ సమయంలో ఈ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం బయటకు తెలిసింది. వారి సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశాయి. కాగా, మృతుల వయస్సు 22, 27 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు.