వాగులో గల్లంతై ఇద్దరు సైనికులు మృతి

వాగులో గల్లంతై ఇద్దరు సైనికులు మృతి

కశ్మీర్​: భారీగా కురుస్తున్న వర్షాలతో కశ్మీర్​లోని సురాన్​కోట్​ వద్ద వాగు దాటుతుండగా ఇద్దరు సైనికులు కొట్టుకుపోయి మృతి చెందారు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 16వ కార్ప్స్​కు చెందిన సైనికులు గల్లంతయినట్లు ఇండియన్​ ఆర్మీ వెల్లడించింది. వాగులో కొట్టుకుపోయి మృతిచెందిన సైనికులు నయిబ్​ సుబేదార్​ కుల్​దీప్​సింగ్​, తెలూ రామ్​లుగా గుర్తించారు. ‘పూంచ్‌లోని క్లిష్టమైన భూభాగంలో ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో నదిని దాటుతున్నప్పుడు వరదలో కొట్టుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారికి నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు, వరుసగా మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జమ్మూ కశ్మీర్‌లో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. దీంతో రెండు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ‘జమ్మూ రీజియన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కథువా, సాంబ జిల్లాలకు వరద ముప్పు ఉంది.. మెరుపు వరదలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయి.. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లోకి వ్యక్తులందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ అధికార ప్రతినిధి సూచించారు.