6 గ్యారంటీలకు నిధులు ఎలా సమకూరుస్తారు

6 గ్యారంటీలకు నిధులు ఎలా సమకూరుస్తారు
  • అప్పుల తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారు చెప్పాలి
  • పెండింగులో 10 లక్షల కొత్త రేషన్ కార్డులు
  • రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలి
  • నిషేధిత తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తరు?
  • సంస్థకు నిధులను ఉపసంహరించాలి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో చెప్పాలని, అలాగే 6 గ్యారెంటీలకు నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బండి సంజయ్  స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారు. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు’’అని ప్రశ్నించారు.  తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. దీంతోపాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో ‘‘సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడు వాజ్ పాయి అని కొనియాడారు.


 వాజ్ పేయి  నిజమైన వారసుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యం. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యం అంటూ జోస్యం చెప్పారు. శ్వేత పత్రం  స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నరు.
 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు? భూములెందుకు అమ్ముకున్నడు? జీతాలెందుకు ఇవ్వలేపోయిండు? బహుశా కేసీఆర్ కుటుంబమే తెలంగాణను అడ్డుపెట్టుకుని 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లున్నరు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.

తబ్లిక్ జమాతే సంస్థకు నిధులు ఎలా ఇస్తారు

ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుంది? దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉగ్రవాదులను తయారు చేయడంతోపాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


స్మార్ట్ సిటీలో 130 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ పై  నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపలేదు. దీనిపై బీజేపీ పక్షాన పోరాడుతాం అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేదాకా ఉద్యమిస్తాం అని స్పష్టం చేశారు ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి, శ్రీనివాస్, మాడ వెంకటరెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.