పవిత్రమైన యాదగిరిగుట్టలో అపచారం.. మాంసాహారంతో విందు భోజనం

పవిత్రమైన యాదగిరిగుట్టలో అపచారం.. మాంసాహారంతో విందు భోజనం

ముద్ర,యాదాద్రి:- యాదాద్రి గుట్టను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ కొలువైన లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు కొంగుబంగారంలా వరాలిస్తారని విశ్వసిస్తారు. అయితే.. అంతటి పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైటీడీఏ దివ్య విడిది (ప్రెసిడెన్సియల్‌ విల్లా)లో మాంసాహార విందు ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం దివ్య విడిది కాటేజీలోని ఆడిటోరియంలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.ఈ సభలో మధ్యాహ్నం జెన్‌కో విల్లాలో దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా చికెన్‌తో కూడిన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో చికెన్‌ పెట్టడమేంటని కొందరు ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు.

దీనిపై కొందరు ఉపాధ్యాయులు కూడా అపచారంభావనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై కొందరు.. వైటీడీఏ అధికారులతో మాట్లాడితే దివ్య విడిది పేరుతో ఆడిటోరియాన్ని ప్రైవేట్‌ కార్యక్రమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు.  ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో.. చికెన్‌ వడ్డించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మాంసాహారాన్ని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై యాదగిరి గుట్ట స్థానికులు, భక్తులుపెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేసినట్లు సమాచారం. పవిత్రమైన ఆలయంలో,  భక్తుల కోసం ఏర్పాటు చేసిన కాటేజీల్లో ఇలాంటి పనులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.వెంటనే యాదాద్రి ఆలయ సిబ్బంది స్పందించి, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనులు చేస్తు, భక్తుల మనోభావాలతో ఆడుకొవద్దని కూడా కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.