రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి గందరగోళం సృష్టిస్తున్నారు

రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి గందరగోళం సృష్టిస్తున్నారు
  • దేశంలో మోడీ గాలి వీస్తుంది
  • 1వ నెంబర్ బటన్ నొక్కి బిజెపికి  ఓటేయండి 
  • కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో మీకు తెలుసా?
  • వాళ్లిద్దరూ రావులు... ఓట్లేస్తే మీకు ఏమీ రావు
  • స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి రిజర్వేషన్లపైప్రజల్లో గందరగోళం సృష్టించడం దుర్మార్గమని కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి అని  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల చరిత్రను బేరీజు వేసి మీకు ఎవరు మేలు చేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తనదైన శైలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై సెటైర్లు వేశారు.

‘‘కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజేందర్ రావు... బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ రావు. రాజేందర్ రావు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలవదు. నాన్ లోకల్ వినోద్ రావు ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ ప్రజలకు కన్పించరు. ఈ ఇద్దరు రావులకు పొరపాటున ఓటేస్తే మీకు ఏమీ రావు....రావు అని అన్నారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తుంటే అక్కసుతో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే రిజర్వేషన్లపై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా  ప్రజలను ఉద్దేశించి సంజయ్ ప్రసంగించారు.

శ్రీరాముడి ఆక్షింతలను కూడా కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట విషయాన్ని ప్రజలు మర్చిపోవాలని మోదీపై ఆ పార్టీల నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నరేంద్రమోదీ చేసిన పాపమేంది? 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడినందుకు తిడుతున్నారా? 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నందుకు తిడుతున్నారా? 30 కోట్ల టాయిలెట్లు కట్టించినందుకు తిడుతున్నారా? 11 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించినందుకు తిడుతున్నారా? దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు తిడుతున్నారా అంటూ విమర్శలు గుప్పించారు.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదు. మరి ప్రజలు ఆయనకు ఎట్లా ఓటేస్తారు? బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ ప్రజలను కలిసిన దాఖలాల్లేవు. ఎన్నడూ ప్రజల పక్షాన పోరాడిన దాఖలాల్లేవని వ్యాఖ్యానించారు.ఇదే మంచిర్యాల చౌరస్తాలో ప్రజల పక్షాన కొట్లాడిన. కోర్టు చౌరస్తా, రాంపూర్ చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, కమాన్ చౌరస్తా సహా కరీంనగర్ లో మీ పక్షాన పోరాడిన. తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉన్నా. వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన. నేను మీ కోసం కొట్లాడి గత 5 ఏళ్లలో 7 సార్లు జైలుకు పోయిన. కేసీఆర్ హయాంలో ప్రజల  పక్షాన కొట్లాడితే 109 కేసులు నాపై పెట్టి వేధించారు. జైలుకు పంపారు. మూడేళ్లు నరకం చూపారు. మా కార్యకర్తల కాళ్లు, తలకాయలు పగలకొట్టారు. అయినా భయపడలే అన్నారు.