విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం
  • మూడ్రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్న సీఈసీ బృందం
  • ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ
  • రేపు, ఎల్లుండి భేటీలు నిర్వహించనున్న సీఈసీ బృందం
  • సీఈసీ బృందాన్ని రేపు కలవనున్న చంద్రబాబు, పవన్

కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా... విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ వారికి స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీఈసీ రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయాల్ రాష్ట్రానికి వచ్చారు. సీఈసీ బృందం నేటి నుంచి మూడ్రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం రేపు (జనవరి 9) సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సీఈసీ బృందం ఎల్లుండి (జనవరి 10) భేటీ అవుతుంది.  

కాగా, రేపు ఉదయం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసమే వారు ఇప్పటికే రేపు వెంకటగిరిలో జరగాల్సిన రా కదలిరా సభను వాయిదా వేసుకున్నారు.