ఎన్నికలపై ఫిర్యాదులు నేరుగా ఇవ్వండి

ఎన్నికలపై ఫిర్యాదులు నేరుగా ఇవ్వండి
  • ప్రతిరోజు సాయంత్రం అందుబాటులో ఉంటాం
  • ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్​ మీనా

ముద్ర, ఏపీ :ఏపీ సార్వత్రిక ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు నేరుగా సచివాలయంలో అందచేయాలని తెలిపారు. కార్యాలయ పని దినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని వివరించారు.  

సమావేశాలు, ఇతర కారణాల వల్ల తాను కార్యాలయంలో అందుబాటులో లేకపోతే అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పడు వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. సెలవు దినాల్లో ఫిర్యాదు చేయాలంటే సచివాలయంలోని 5వ బ్లాకు (గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.129) లో సంప్రదించాలని సీఈసీ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. 

రూ. 47.5 కోట్లు స్వాధీనం

ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నామని సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, డ్రగ్స్‌ పట్టుబడిందని వివరించారు. వీటికి సంబంధించి 4337 కేసులు, కోడ్‌ ఉల్లంఘటనకు సంబంధించి 247 కేసులు నమోదు చేశామన్నారు. 8,681 లైసెన్స్‌ కలిగిన ఆయుధాలను ఆయా పోలీస్‌స్టేషన్‌లో జమ చేశారని ఆయన పేర్కొన్నారు.