శవ రాజకీయాలు జగన్​ నైజం

శవ రాజకీయాలు జగన్​ నైజం
  • పెన్షన్ దారుల మరణాలకు బాధ్యత వహించి సీఎంగా తప్పుకోవాలి
  • అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్
  • పెంచబోయే పెన్షన్ ఏప్రిల్ నుంచే వర్తింపు
  • ప్రతి ఇంటికీ పెద్ద కొడుకునవుతా
  • నేరుగా ఇంటికే పెన్షన్ అందిస్తా
  • నాది సమాజ హితం.. జగన్ ది స్వార్థం
  • మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు 

ముద్ర, ఏపీ : రాజకీయ కుట్రతో పెన్షన్ దారుల మరణాలకు కారకుడైన జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి తక్షణమే వైదొలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలతో ప్రజల ప్రాణాలు తీస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో శుక్రవారం చంద్రబాబు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్​తప్పుడు ప్రచారం చేసి లబ్ధిపొందడం సరికాదని, వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయాలు ఉన్నాయని, తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారని మండిపడ్డారు.

గత ఎన్నికల్లో బాబాయిని చంపి నెపం తమపై నెట్టి సానుభూతితో గెలుపొందారని, ఈ  ఎన్నికల్లో వృద్ధులను చంపేసి రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఈ దురుద్ధేశంలో అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ప్రతినెలా 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ ఎందుకివ్వలేదని, ఓడిపోతామన్న భయంతోనే అప్పు తెచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టారన్నారు. మార్చితో బడ్జెట్ ముగుస్తుందని,  ముందే నిధులు ఖాతా నుంచి తీసుకోవాల్సి ఉందని, స్వార్థ రాజకీయాల కోసం ఖజానా ఖాళీ చేసి 1వ తేదీన ఇవ్వలేదని అన్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఇస్తామని మార్చి 27న సర్క్యులర్ ఇచ్చారని, వలంటీర్లను పెన్షన్ పంపిణీలో జోక్యం చేసుకోకూడదని మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెప్పిందని, ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేయవచ్చని ఆయన అన్నారు.

ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ చెప్పలేదని సూచించారు. వలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పన్నాగం చేశారని, ఇన్నాళ్లూ మీటింగ్ లకు రాకపోతే పథకాలు తొలగిస్తూ బెదిరించారని, రాజీనామా చేసిన వలంటీర్ల నియామకాలపైనే తన తొలిసంతకం అని జగన్ సిగ్గులేకుండా చెప్పాడని చంద్రబాబు మండిపడ్డారు. వలంటీర్లు తటస్థంగా ఉండాలని తాము మొదటి నుండి కోరుతున్నామని, వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము వచ్చిన తర్వాత కూడా వ్యవస్థను కొనసాగిస్తామని, చదువున్న వారికి కెరీర్ బిల్డ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల కోసం వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, వలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. తన హయాంలో పంచాయతీ, రెవెన్యూ అధికారులతో పెన్షన్లు పంపిణీ చేయించామని, నేడు రాష్ట్రంలో 1.35 వేల మంది వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారని, వారితో పెన్షన్లు అందిస్తే ఒక్క రోజులోనే ఇవ్వొచ్చని, తాను ఇటీవల సీఎస్, ఈసీతో కూడా మాట్లాడానని, పంపణీ చేసే వ్యవస్థ ఉంది...ఈ ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెట్టేందుకు చూస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పెన్షన్లపై పేటెంట్ హక్కు టీడీపీదే

ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ విధానాన్ని తెచ్చారని, తర్వాత తాను రూ.75 చేశానని, 2004లో రాజశేఖర్ రెడ్డి వచ్చి రూ.200 చేశారని, 2014లో తాను మళ్లీ వచ్చాక రూ.1000కి ఒకేసారి పెంచినట్లు చంద్రబాబు చెప్పారు. ఖర్చులు పెరిగాయని ఆలోచించి రూ.2 వేలు చేశానని, ఈ ప్రభుత్వం ఐదేళ్లలో వెయ్యి పెంచిందని, తాను రాష్ట్రంలో ఎక్కడున్నా పెన్షన్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చానని గుర్తు చేశారు. కానీ జగన్ నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించారని, దీనిపైనా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వ అధికారాలు పరిమితిలో ఉంటాయని, వలంటీర్లు లేకపోతే పంచాయతీ, సచివాలయ అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు. సైకో సీఎం ఇవ్వొద్దని అడ్డపడితే అధికార యంత్రాంగం చేస్తుందా అని, జగన్ తో సీఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధరెడ్డి కలిసి ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. తాను మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని చెప్పానని, అందుకే జగన్ వలంటీర్ల నియామకాలపై సంతకం పెడతానంటున్నాడని, తనది సమాజ హితం, జగన్ ది స్వార్థం అని, దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టి దాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం అత్యంత నీచమన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వమే కుట్రలు చేసి ప్రజల ప్రాణాలు తీసి ప్రతిపక్షాలపై నెట్టి నీచరాజకీయం చేస్తోందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని  అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను పెంచుతామని, పెంచబోయే  పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కూడా వర్తిస్తుందరని చంద్రబాబు ప్రకటించారు. మూడు నెలలకు పెంచిన పెన్షన్ రూ.3 వేలను రూ.4 వేలతో కలిపి ఇస్తామని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికీ పథకం ఇవ్వడం తన బాధ్యత అని, జగన్ మాయల ఫకీరు కంటే దారుణమని అన్నారు. ఎప్పుడు వచ్చి ఎవరి నెత్తిన చేయిపెట్టి, ఎవర్ని శవం చేస్తాడో తెలీదు అని, పెన్షన్లపై పేటెంట్ హక్కు టీడీపీదే అని, అధికారంలోకి రాగానే అర్హులకు రూ.4వేల పెన్షన్ ఇవ్వబోతునున్నామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు. తన భర్త నంగా బాబురెడ్డి, అనుచరులతో కలిసి వచ్చి నల్లజర్లలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ పులవర్తి నాని, తదితరులు పాల్గొన్నారు.