ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం పూర్తి చేయండి అధికారులకు కలెక్టర్ ఆదేశం

ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం పూర్తి చేయండి అధికారులకు కలెక్టర్ ఆదేశం

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వైద్య, ఆరోగ్యాశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,సబ్ హెల్త్ సెంటర్ల భవన నిర్మానాలు, మరమ్మత్తు పనుల ప్రగతి పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా 5 పిహెచ్సి లు,100 సబ్ హెల్త్ కేంద్రాలను, నిర్మించేందుకు,అలాగే 21 పీహెచ్సీలు,56 హెల్త్ సబ్ సెంటర్ల మరమ్మతులు పనులు చేపట్టామన్నారు.వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజల వైద్య సేవల కొరకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. జిల్లాలో చేపట్టిన ఈ నిర్మాణాల పై రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందున నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి,టిఎస్ ఎంఐడిసి డిఇ విశ్వ ప్రసాద్ లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరగా పనులు పూర్తయ్యాలా పర్యవేక్షించాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. కాశీనాథ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అజీముద్దీన్లకు సూచించారు.