గంజాయి నిరోధానికి స్పెషల్ ఫోకస్, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు.
- గంజాయి కి అలవాటుపడ్డ యువకుల సమాచారాన్ని ఇవ్వండి.
- సంవత్సర కాలంలో 650 కేజీ ల గంజాయి సీజ్ చేశాం.
- 25 కేసుల్లో 59 మంది నిందితుల అరెస్ట్, ఒకరిపై PD యాక్ట్ నమోదు.
- రాహుల్ హెగ్డే, ఎస్పి సూర్యాపేట.
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లాలో గంజాయి నిరోధానికి, గంజాయి కి అలవాటు పడ్డవారిని గుర్తించడానికి పోలీస్ స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగినదనీ, ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపినారు. గంజాయి సమాజంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తుందనీ, దీని మూలాలను సమూలంగా నాశనం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ కోరారు. గంజాయి నిరోధానికి పట్టిష్టంగా పనిచేస్తున్నామని తెలిపినారు. యువకులు గంజాయి మత్తుకు బానిసలు కావొద్దు, విద్యార్థులు, యువకులు ఎవరైనా గంజాయి మత్తుకు అలవాటు పడ్డారా అనేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.
గంజాయి నివారణలో భాగంగా గతంలో గంజాయి రవాణాకు పాల్పడిన నేరస్తులను, గంజాయి వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను, యువతను గమనిస్తున్నామని వారిపై నిఘా ఉంచామని తెలిపారు. గంజాయి రవాణా చేసే వారిని గంజాయి వినియోగిస్తున్న వారి సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. గత సంవత్సర కాలంగా గంజాయినిరోధంపై ఉక్కు పాదం మోపుతూ జిల్లా పోలీస్ శాఖ 650 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని 25 కేసులు నమోదు చేసి 59 మందిని అరెస్టు చేయడం జరిగిందని, ఇందులో ఒకరిపై పిడి యాక్ట్ నమోదు చేశామని తెలిపినారు.