ఈపీఎఫ్వో కొత్త నిబంధనలు..
- జనన ధృవీకరణకు ఆధార్ చెల్లుబాటు కాదు
ముంబై : ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. ఆధార్ కార్డు గురించి ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆధార్ను అన్ని రకాల వాటికి అనుసంధానించడం తప్పనిసరి అయిపోయింది. బ్యాంకు అకౌంట్ నుంచి ఓటర్ ఐడి, పాన్ ఇలా రకరకాల వాటికి ఆధార్ అనుసంధానించడం తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( ఈపీఎఫ్ఓ ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు పుట్టిన తేదీని అప్డేట్ చేసేందుకు, లేదా సవరించేందుకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అంటే ఈపీఎఫ్ఓ ఇకపై ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును ఉపయోగించదు. ఈపీఎఫ్వో చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి మినహాయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అసోసియేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈపీఎఫ్ఓ వివరాల ప్రకారం.. ఈ మార్పు చేసుకునేందుకు జనన ధృవీకరణ పత్రం ద్వారా చేసుకోవచ్చు. ఇదే కాకుండా మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన పాఠశాల బదిలీ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్ సర్టిఫికేట్, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.