మస్క్ నిర్ణయం కరెక్టే
![మస్క్ నిర్ణయం కరెక్టే](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a6607a4bda2.jpg)
- ట్విట్టర్ బలోపేతానికేనన్న సీఈఓ
వాషింగ్టన్ : ట్విట్టర్ అధినేత ఎలన్మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈఓ లిండా యకారినో సమర్థించారు. యూజర్లు ట్వీట్లను వీక్షించడానికి పరిమితి విధిస్తూ ఎలన్మస్క్ నిర్ణయించారు. ట్విట్టర్ను బలోపేతం చేయడానికి మస్క్ నిర్ణయం చేయూతనిస్తుందని ట్వీట్ చేశారు. ఎలన్మస్క్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఈఓ లిండా యకారినో ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
ట్విట్టర్లో ఫేక్ ఖాతాలను నియంత్రించడానికే ఎలన్మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని లిండా యకారినో చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయం వల్ల సాధారణ ట్విట్టర్ యూజర్లపై ప్రభావం చూపదని అభిప్రాయ పడ్డారు. ట్వీట్ల వీక్షణకు పరిమితులు విధిస్తూ ఎలన్మస్క్ నిర్ణయం తీసుకున్న మూడు రోజులకు సీఈఓ లిండా యకారినో ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామం. గత శనివారం రాత్రి నుంచి ట్విట్టర్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ ట్వీట్లు చూడలేకపోతున్నామంటూ పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ట్విట్టర్లో పోస్టుల వీక్షణకు పరిమితులు విధిస్తున్నామని ఎలన్మస్క్ వెల్లడించారు. ఎలన్మస్క్ నిర్ణయంతో ట్విట్టర్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్కు పోటీగా ఫేస్బుక్ మాతృసంస్థ త్వరలో `థ్రెడ్స్` అనే యాప్ తీసుకు రానున్నట్లు సంకేతాలిచ్చింది.