కరీంనగర్ నుండే ఎన్నికల శంఖారావం

కరీంనగర్ నుండే ఎన్నికల శంఖారావం
  • 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం
  • ఈ నెల 28న హాజరుకానున్న  అమిత్ షా
  • వచ్చే నెల 5 నుండి గ్రామాల వారీగా పాదయాత్ర
  • బీఆర్ఎస్ ది మూడో స్థానమే
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. శుక్రవారం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్ రేపు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులతోపాటు జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతోనూ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి తెలంగాణకు వస్తున్నారు. మూడు క్లస్టర్ మీటింగుల్లో  పాల్గొంటారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ మీటింగ్ లో పాల్గొంటారు. వీటితోపాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారని చెప్పారు.


అందులో భాగంగా ఈనెల 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. 20 వేల మంది కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాబట్టి ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చింది? ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందనే అంశంపై పూర్తి వివరాలను గ్రామాల వారీగా వివరిస్తాం అని తెలిపారు.
ఫిబ్రవరి 5 నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర ప్రారంభిస్తున్నా. గ్రామాల్లో పాదయాత్ర చేస్తా.  

సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లేటప్పుడు మాత్రం వెహికల్ లో వెళతా. దాదాపు 20 రోజులపాటు యాత్ర కొనసాగిస్తా అని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తా. కేంద్రం చేసిన కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తా అని స్పష్టం చేశారు. గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్. ఒక మహిళా గవర్నర్ ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారు.

గవర్నర్ పర్యటనలకు ప్రోటోకాల్ పాటించలేదు. అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ ది మూడో స్థానమే ఇంకా గుండా గిరి చేస్తాం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నాయకులు ఎన్నం ప్రకాష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.