ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తున్నా - మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తున్నా -  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా నిరాశను కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా నేను గెలువాలని ఎంతో కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నాకు ఓటువేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 5ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, సంక్షేమ పథకాలు అందించానని గుర్తు చేశారు. కరోనా లాంటి పరిస్థితుల్లో నిత్యం ప్రజలకు అంత్యంత చేరువగా ఉండి సేవలను అందించడం జరిగిందని, ప్రభుత్వ పరమైన కార్యక్రమాలతో పాటు, జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా చాలా సేవలను అందించడం జరిగిందని తెలిపారు. ఫలితాలు నిరాశ పరిచినా, ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రజల తీర్పుతో గెలిచిన సత్యనారాయణ రావును అభినందిస్తున్నాని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తి స్థాయిలో  నెరవేర్చే దిశగా పనిచేయాలని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి తదితరులు పాల్గొన్నారు.