మందుబాబులకు ఆరోగ్యకరమైన శుభవార్త...

మందుబాబులకు ఆరోగ్యకరమైన శుభవార్త...
  • మార్కెట్ లోకి కొత్త విస్కీ.. తాగితే కిక్కుతో పాటు ఆరోగ్యం కూడా

ముద్ర,హైదరాబాద్:-తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన మద్యం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని.. సాధారణ మద్యం మాదిరే కిక్కు ఎక్కుతుందని ప్రకటించింది. ఇంతకు ఆ కంపెనీ ఏది అంటే.. అదే హైదరాబాద్‌ కు చెందిన బయో లిక్కర్స్‌ అండ్‌ డిస్టలరీస్‌ సంస్థ. తాజాగా ఈ కంపెనీ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత బుధవారం నాడు ఈ లిక్కర్‌ను మార్కెట్ లోకి విడుదల చేసినట్టు తెలిసింది.

ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ బీ శ్రీనివాస అమర్‌నాథ్‌ ఈ లిక్కర్‌ను సృష్టించారు. ఈమద్యంలో ఎలాంటి సింథటిక్‌ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక ఈ లిక్కర్‌లో బయో ఫ్లేవనాయిడ్స్‌, బయో ఆల్కలాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్‌, వివిధ మూలికలు ఉంటాయన్నారు.

ఈ మద్యం తయారీలో అకాసియా, కలబంద, పసుపు, తులసి, లవంగాలు, కొత్తిమీర, అల్లం, దాల్చినచెక, జీలకర్ర, నల్ల మిరియాలు, బ్లాక్‌బెర్రీస్‌, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపేన్‌, జెనిటన్‌, రైజోమ్‌, గ్వారానా, రటానీ రూట్‌, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్‌, వెరోనికా, వైల్డ్‌ చెర్రీ, తేనె, బే ఆకులు, బ్రయోనియా రూట్‌ తదితర పదార్థాలు వినియోగించినట్లు తెలిపారు. అందువల్ల ఈ మద్యాన్ని సేవిస్తే కిక్కుతో పాటు ఆరోగ్యం కూడా అంటున్నారు.