ప్రజాక్షేత్రంలో ఉంటాను... పార్లమెంట్ లో ప్రజాగొంతుకనవుతాను...

ప్రజాక్షేత్రంలో ఉంటాను... పార్లమెంట్ లో ప్రజాగొంతుకనవుతాను...
  • బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు కొత్తలు తేలేదు
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదు
  • కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

ముద్ర,చొప్పదండి: అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, సాధ్యంకానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజాక్షేత్రంలో ఉంటూ, పార్లమెంట్లో ప్రజాగొంతూకనవుతానని కరీంనగర్ మాజీ  ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం రాంపూర్ శివారు లో  గురువారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో  పాల్గొని ఆయన మాట్లాడారు.తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు రూ.7700ల కోట్లు నిధులు కేటాయిస్తే రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు నిలిపి వేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారని రైతులను ఎందుకు విస్మరించారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విమర్శించారు.

2004లో ఐదుగురు ఎంపీలు గెలిచి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ గారితో కలిసి గళమెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోతల పథకంలో 45టీఎంసీల సామర్థ్యం ఉన్న చిన్న ,చిన్న రిజర్వాయర్ల సామర్థ్యం 250 టీఎంసీలకు పెంచడంతోనే అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు.2009లో మళ్ళీ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళితే 2014లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూడున్నరేళ్ల  కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.


కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంపై ఫైనాన్స్ మంత్రి, ఉన్నతాధికారులతో పది సార్లు చర్చించి నిర్ణయం తీసుకునేవారని అన్నారు.కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మానేరు రివర్ ప్రంట్ తో పాటు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ రహాదారుల కోసం కొట్లాడి కరీంనగర్ చుట్టుపక్కల నాలుగు జాతీయ రహాదారులను నిర్మాణం చేశామన్నారు.2004లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు రైల్వేలైన్ కావాలని ఆడిగి మంజూరు చేయించామని, 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వే ప్రాజెక్టు ను పట్టించుకోలేదన్నారు. 2014లో తాను కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ కరీంనగర్ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కిందని పేర్కొన్నారు.కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారని, ఎన్ని నిధులు తీసుకువచ్చారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం బండి సంజయ్ నయాపైసా నిధులు తేలేదాని, నిధులు తెచ్చానని బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా... తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పును సిరసావహిస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని, కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,ఎంపీపీ విమల సుదర్శన్, జడ్పీటీసి రామ్మోహన్ రావు, బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సింగిల్ విండో ఛైర్మన్ లు మధుసూదన్ రావు,  సాగర్ రావు, రామలింగారెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.