కోహ్లీ, రోహిత్ ఇన్
- చివరి పోరుకు సిద్దమైన టీమిండియా
- ఆసీస్తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ?
రాజ్కోట్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి పోరుకు సిద్దమైంది. బుధవారం రాజ్ కోట్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఆసీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంటే.. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. విశ్రాంతి పేరిట తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడో వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. రెండో వన్డే ఆడని జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన మహమ్మద్ సిరాజ్ను కూడా ఈ మ్యాచ్లో ఆడించనున్నారు. సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీతో టీమిండియా తుది జట్టు ఎంపిక టీమ్మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. విరామం లేకుండా ఆడుతున్న శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్తో పాటు కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీలకు చివరి మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీమ్ ఎంపిక సులువు కానుంది. శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇస్తే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ఓపెనింగ్ చేయనున్నాడు. గిల్ ఆడితే మాత్రం రుతురాజ్ బెంచ్కే పరిమితమవుతాడు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. కేఎల్ రాహుల్కు రెస్ట్ ఇస్తే ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు. లేదంటే అతను కూడా బెంచ్కే పరిమితమవుతాడు. సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యపై వేటు తప్పేలా లేదు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో సూర్యకు చోటు లేకుండా పోయింది. జడేజాకు రెస్ట్ ఇస్తే అశ్విన్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. లేకుంటే అశ్విన్ బెంచ్కు పరిమితమవుతాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్రసిధ్ కృష్ణ ఆడే అవకాశం ఉంది. షమీని కొనసాగిస్తే మాత్రం ప్రసిధ్ చోటు కోల్పోతాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్/ రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవీచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ/ప్రసిధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్