రిషబ్​పంత్​ వీడియో వైరల్​!

రిషబ్​పంత్​ వీడియో వైరల్​!

ముంబై: ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్న రిషభ్ పంత్.. చేసిన పని ఒకటి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో తన రెండో పుట్టిన రోజుగా 2023 జనవరి 5వ తేదీని పంత్ జోడించాడు. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడాడు. జనవరి 5న వైద్యులు పంత్‌కు ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు తెలిపారు. దీంతో అదే రోజును పంత్ తన రెండో డేట్ ఆఫ్ బర్త్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.టీమిండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని బీఎండబ్ల్యూ కారులో ఒక్కడే ఇంటికి బయలుదేరిన పంత్.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు రిషభ్ పంత్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. పలు సర్జరీల తర్వాత వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం పంత్ చేసిన చర్యపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన పంత్‌కు ఇది నిజంగా రెండో జన్మే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి పంత్ 1997 అక్టోబర్ 4న జన్మించాడు. రోడ్డు ప్రమాదం అనంతరం జరిగిన శస్త్రచికిత్స తర్వాత పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్‌డేట్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న పంత్.. ఇటీవల ఊత కర్ర లేకుండా నడుస్తున్న ఫోటోలు, స్విమ్మింగ్‌ పూల్‌లో నడుస్తున్న వీడియోలను పంచుకున్నాడు. అనుకున్న దానికన్నా వేగంగా కోలుకుంటున్న పంత్.. జిమ్ సెషన్ కూడా ప్రారంభించాడు. తాజాగా ఎన్‌సీఏలో కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ప్రస్తుతం పంత్ సోషల్ మీడియాలో పెట్టుకున్న బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.