నేడే హస్తినలో భారత్–అఫ్ఘాన్ మ్యాచ్
- ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ వేటలో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. న్యూఢిల్లీ వేదికగా బుధవారం జరిగే రెండో మ్యాచ్లో అఫ్గానిస్థాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియాపై ఘన విజయంతో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుంటే.. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభావంతో అఫ్గాన్ రెండో పోరుకు రెడీ అయ్యింది.అయితే ఈ మ్యాచ్లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్మన్ గిల్ ఇంకా కోలుకోకపోవడంతో ఇషాన్ కిషనే ఓపెనర్గా కొనసాగనున్నాడు. అయితే ఢిల్లీ వికెట్ ఫ్లాట్గా ఉండనుంది. ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక కూడా 300 ప్లస్ రన్స్ చేసి ఓటమిపాలైంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ వికెట్పై టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఎక్స్ట్రా పేసర్గా మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోనున్నారు. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. మూడో పేసర్గా షమీని పరిగణలోకి తీసుకోవచ్చు. పిచ్ను మార్చి స్లో వికెట్ను సిద్దం చేస్తే మాత్రం అశ్వినే జట్టులో కొనసాగనున్నాడు. అప్పుడు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించనుంది.తొలి మ్యాచ్లో నిర్లక్ష్యపు షాట్తో విఫలమైన శ్రేయస్ అయ్యర్కు మరో అవకాశం ఇవ్వనున్నారు. అతనితో పాటు విరాట్ కోహ్లీకి ఢిల్లీ హోమ్ గ్రౌండ్. ఓపెనర్లుగా మరోసారి రోహిత్, ఇషాన్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి దిగనున్నాడు.ఆరోస్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడనుండగా.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, 8వస్థానంలో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నారు. పేసర్లుగా మహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్లు ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉండగా.. మిగతా బ్యాటర్లు లయను అందుకుంటే భారత్కు తిరుగుండదు. బౌలింగ్లో భారత్కు తిరుగులేదు. తొలి మ్యాచ్లో పటిష్ట ఆసీస్ను 199 పరుగులకే కుప్పకూల్చారు.
భారత్ తుది జట్టు(అంచనా):-
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.