అధికారులు నిబద్ధతతో పని చేయాలి

అధికారులు నిబద్ధతతో పని చేయాలి

నియోజకవర్గాల వారీగా ప్రగతి నివేదికలు రెడీ చేయండి: జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: జిల్లా అభివృద్ధికి అధికారులు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని మూడు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులను ఆఫీసర్లు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.

పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగామ నియోజకవర్గల్లో సాధించిన ప్రగతిపై నివేదిక రెడీ చేయాలని ఆదేశించారు. జనగామలో ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాల పనులు, ఇటీవల వైద్య రంగంలో సాధించిన ప్రగతి వివరాలు, రేడియాలజీ ల్యాబ్ ప్రారంభోత్సవం, నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. ఈనెల 28 లోగా అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామిరెడ్డి, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.