నాలుగోసారి విజయం నాదే

నాలుగోసారి విజయం నాదే
  • మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం
  • బండి అకృత్యాలతో ప్రజలు విసిగి పోయారు
  • కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గంలో నాలుగోసారి విజయం సాధించబోతున్నానని బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మం కోసం దేవుడి పేరు చెప్పే బండి సంజయ్ ఇస్కాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి గుడికి ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎంపీ గా బండి సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారు. అందుకే మూడోసారి ఓడిపోతున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ వాళ్లు డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు సభ్యుడి స్థాయిలో హుందాగా వుండాల్సిన బండి సంజయ్ స్వయంగా డబ్బులు పంచడం ఎంతవరకు సమంజసం అన్నారు.

డబ్బులు మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేస్తావా సంజయ్ అంటూ సవాల్ విసిరారు. కొత్తపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారని తెలిపారు. బండి సంజయ్ డబ్బులు పంచుతున్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టమవుతుందని తెలిపారు. ఇంట్లో ఉన్న మా కార్యకర్తపై స్వయంగా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు పంచుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎంపీ స్థానంలో ఉండి గుండాలను తీసుకుపోయి దాడులు చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ ఎమ్మెల్యే గెలిస్తే కరీంనగర్ ప్రశాంతంగా ఉండదని పేర్కొన్నారు. లక్ష సెల్ ఫోన్లు అని ప్రచారం చేసిన సంజయ్ అవి ఎక్కడ ఉన్నాయి నిజంగా మేము పంచినట్లయైతే ఒక్కటైనా చూపించగలవా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ నీ బూటకపు మాటలు నమ్మే స్థితిలో కరీంనగర్ ప్రజలు లేరని తెలిపారు ఈ సమావేశంలో మేయర్ వై సునీల్ రావు నాయకులు చల్ల హరి శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.