వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది
- కార్తీక వనసమారాధన మన సంప్రదాయం
- వన భోజనంతో పుణ్యఫలం
- మానవ మనుగడ లో వనాల మేలు ఎనలేనిది
- అందరూ కలిసిమెలసి ఉండాలి..
- వనమారాదన వేడుకల్లో శాసన సభ్యులు జగదీష్ రెడ్డి
ముద్ర,సూర్యాపేట:-ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతాయని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ లో సంతోషి మాతా రూపాదేవి ట్రస్ట్ ఆధ్వర్యం లొ ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ లో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు జగదీష్ రెడ్డి,శివ లింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగాలకు భక్తులు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ...
దేశసంస్కృతి ,సంప్రదాయాలను , హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం అన్నారు. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం అన్నారు . భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే అన్న జగదీశ్ రెడ్డి అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి , వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది అన్నారు.కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటలు , పాటలు కబుర్లకు ఇది చక్కటి వేదిక అన్నారు .పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం అన్నారు.వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదన్నారు.భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది అన్నారు.