నాగంను...మంత్రిని చేద్దాం...!

నాగంను...మంత్రిని చేద్దాం...!
  • పెద్దమనిషి గట్టిగా చేయ్ లక్ష్మన్నా
  • టిక్కెట్ వచ్చేలా చేయండి
  • నాగంపై మర్రి వ్యాఖ్యల కలకలం

నాగర్‌కర్నూల్: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ... ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల సమావేశానఖి  హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు నాగం జనార్థన్ రెడ్డి  ఒకరికొకరు ఎదురుపడ్డారు పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాటలు ఓవైపు కలకలం రేపడంతో పాటుగా హాస్యాన్నీ నింపాయి.  నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నాగం తనకే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే నాగంకు ప్రజల్లో, స్థానిక కాంగ్రెస్‌లో ఆశించినంత ఆదరణ లభించడం లేదు. అయితే నాగం కు టికెట్ వస్తే గెలుపు సులభం అవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశంగా ఉంది.

ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తనకు ఎదురుగా వచ్చిన నాగంను, నాగం అనుచరులను ఉద్దేశిస్తూ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించండి పెద్దమనిషిని మంత్రిని చేద్దాం.. అంటూ నవ్వుకుంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. నాగం అనుచరుడు ఐతోల్ లక్ష్మయ్యను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ వీడియోలో కనిపించాయి. లక్ష్మన్న...గట్టిగా చేయి.. పెద్దమనిషి... పోనీయకుండి... కష్టపడ్డడు... మంత్రిని చేద్దం.. కచ్చితంగా అవుతడు... టిక్కెట్ వచ్చేటట్టు చేయండి. అంతకుముందు మర్రి నేరుగా అంటుండగా నాగం సున్నితంగా వారించినట్లుగా కనిపిస్తుంది. ఇలా గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే మర్రిలో నెలకొన్న భయం ఈ విధంగా బాహాటంగా వ్యక్తపరిచినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేకుంటే కాంగ్రెస్ టికెట్ నాగం కు రావాలని మర్రి ఎందుకు కోరుకుంటారని చర్చ జరుగుతుంది. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉంటే గెలుపు కష్టంగా మారుతుందని భయమే మర్రిని ఈ విధంగా మాట్లాడించినట్లుగా అక్కడికి వచ్చిన పలువురు గుసగుసలాడుకున్నారు.