మాగుంట రాఘవ బెయిల్ విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కొడుకు మాగుంట రాఘవ బెయిల్ విచారణ మార్చి 25కు వాయిదా పడింది. వాస్తవానికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో మార్చి 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాఘవను తీహార్ జైలు అధికారులు హాజరుపరచాల్సి ఉంది. కానీ అధికారులు రాఘవను హాజరుపరచలేదు. దీంతో తీహార్ జైలు సూపరిండెంట్ పై స్పెషల్ కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే విచారణ సందర్భంగా రాఘవను వర్చువల్ గా కచ్చితంగా హాజరుపర్చాలని ధర్మాసనం ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఫిబ్రవరి 11 న ఆరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాఘవ తీహార్ జైలులో ఉన్నాడు. రాఘవ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైతం ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది.