ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ధాన్యం రవాణాకు ట్రాక్టర్లను వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమంలో అందన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యాక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారంప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన దరఖాస్తుల పెండింగ్ వివరాలను సమీక్షించడం జరుగుతుందని అధికారులు సంబంధిత వివరాలతో ఉదయం 10 గంటలకు ప్రజావాణికి హాజరుకావాలని సూచించారు. ప్రజావాణిలో 54 దరఖాస్తులు రాగా వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వేబిక్స్ ద్వారా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుండి మండల తాహశీల్దార్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని, ధాన్యం రవాణా కొరకు ట్రాక్టర్లను వినియోగించాలని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఆకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం పట్ల రైతులు అపోహ పడవద్దని ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాలను నిరంతరం పరివేక్షిస్తూ దాన్యం రవాణా వేగవంతమయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యాక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, జడ్పీటీఈవో సురేష్ కుమార్, ఇన్చార్జి డిఆర్ఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.