హైదరాబాద్ మెట్రో (ఫేజ్ 2) విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. 

హైదరాబాద్ మెట్రో (ఫేజ్ 2) విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. 

సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.కేవలం కొద్ది మందికి ఉపయోగపడేలా గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కొత్త రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఏయే ప్రాంతాల నుంచి ఏయే మార్గాల్లో మెట్రో విస్తరించనుందో తెలియజేసేలా మ్యాప్ తయారు చేసింది.  ఎక్కువ ఖర్చుతో తక్కువ మందికి ఉపయోగపడేలా గతంలో తయారు చేసిన డిజైన్లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేయటం విశేషం. 

పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న మెట్రో రైలు సేవలు.. కొత్త రూట్ల విస్తరణ, అన్ని ప్రాంతాల కనెక్టివిటీతో మరింత ఎక్కువ మందికి చేరవేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.హైదరాబాద్ సిటీలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాల అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రతిపాదిత మార్గాలున్నాయి. 

దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం అందరికీ మరింత చేరువవనుంది.హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్ బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది.ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్ ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగిస్తారు. దీనికి తోడు కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు రూట్ నిర్మాణం చేపడుతారు.ఫేజ్ 2 లో మొత్తం 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ఈ ప్రతిపాదనలు తయారు చేశారు.   

కొత్త రూట్ మ్యాప్

కారిడార్ 2:- ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు (5.5 కిలోమీటర్లు)

కారిడార్ 2:- ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు)

కారిడార్ 4:- నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు)

కారిడార్ 4:- మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు)

కారిడార్ 5:- రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కిలోమీటర్లు)

కారిడార్ 6:- మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కిలోమీటర్లు)

కారిడార్ 7:- ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కిలోమీటర్లు)