ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా బస్సు సర్వీసులు నడపాలి...
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని బస్సు సర్వీసుల్లో 60 శాతం మహిళల ఆక్యుపెన్సీ....
- ఆర్టీసి బస్సులలో గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య...
- క్యాంపు కార్యాలయంలో మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత...
- ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమీక్షించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర ప్రతినిధి, మంథని: ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా బస్సు సర్వీసులు నడపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ను కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ప్రతిరోజు 2 లక్షల 40 వేల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తే నేడు ఆ సంఖ్య 3 లక్షల 70 వేలకు పెరిగిందని, ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 60 శాతం వరకు మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉందని, ఆ ర్ టి సి రీజనల్ మేనేజర్ తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసులపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథనిలోని గ్రామీణ ప్రాంతాల్లొ బస్సు సర్వీసు లేని గ్రామాలకు నూతన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా బస్సు సర్వీసులు నడపాలని మంత్రి ఆదేశించారు.
వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు పెంచాలని, అవసరమైన రూట్లలో అదనపు ట్రిప్పులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
అంతకుముందు క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబును జిల్లా, డివిజన్, మండల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్.ఎం.లు ఎస్. భూపతి రెడ్డి, సత్యనారాయణ, మంథని డి.ఎం. రాజశేఖరం, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.