భారీగా పెరగనున్న చక్కెర ధరలు
- నాలుగేండ్ల కనిష్టానికి పడిపోయిన ఉత్పత్తి
న్యూఢిల్లీ : దేశంలో చక్కెర ధరలు భారీగా పెరగన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడు వారాల్లో ధరలు రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. గత మూడేళ్లుగా ప్రపంచంలోని అగ్రగామి ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. అయితే, ప్రస్తుతం మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి ఆగస్టు తర్వాత 4 సంవత్సరాలలో కనిష్టానికి పడిపోయిందని ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని వాణిజ్య వర్గాల సమాచారం . భారత్ లో చక్కెర ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. చక్కెర ధరలు పక్షం రోజుల్లో 3 శాతానికి పైగా పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే సమయంలో రానున్న నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి ప్రాంతమైన మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటం రాబోయే సీజన్ లో చెరకు ఉత్పత్తిపై ఆందోళనలను పెంచిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా మార్కెట్లో చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చక్కెర ధరలు పెరుగుతున్న క్రమంలో ఆహార ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది.
గత మూడేళ్లుగా భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా ఉంది. భారతదేశ చక్కెర ఉత్పత్తి అంచనాలు, ఎగుమతి ఆంక్షలు ఆందోళనలు రేకెత్తించడంతో ప్రపంచ చక్కెర ధరలను 12 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, ఎగుమతులు లేకపోవడం వల్ల స్థానిక ఉత్పత్తిదారులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. అదే సమయంలో, దిగుమతి లేనందున, స్థానిక ధరలకు ప్రపంచ ధరలతో ప్రత్యక్ష / పరోక్ష సంబంధం లేకుండా ఉంది. ఈ నెల ప్రారంభంలో, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఎ) ఎస్ఎస్ 24 (అక్టోబర్ 23- సెప్టెంబర్ 24) కోసం ప్రాథమిక చక్కెర ఉత్పత్తి (నికర) 31.7 మిలియన్ టన్నులుగా అంచనా వేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరకును పెద్ద ఎత్తున పండిస్తారు. అయితే ఈ ఏడాది ఈ రాష్ట్రాల్లో చెరకు సాగు తగ్గింది. ఇది ఉత్పత్తి అంచనాలను మరింత తగ్గించే ప్రమాదం ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. దేశంలో వచ్చే రెండు నెలలు పండుగలు సీజన్ కాబట్టి ప్రభుత్వం ధరలు పెరుగకుండా చూడాల్సిన భాధ్యత ఉంది