బీజేపీని తూర్పారబట్టిన స్టాలిన్
తమిళనాడు: బీజేపీ పార్టీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తూర్పారబట్టారు. గురువారం ముంబైలోని ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ముందు స్పీకింగ్ ఫర్ ఇండియా పాడ్కాస్ట్ వీడియోను తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు. ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ఈ సిరీస్ 'ఉంగలిల్ ఒరువన్' తరహాలో ఉంటుందని తెలిపారు. ఒక నిమిషం 14 సెకన్ల పాటు వీడియోను విడుదల చేయగా.. అందులో దేశాన్ని బీజేపీ విధ్వంసం చేస్తుందని ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ప్రశ్న, దానికి సమాధానం తరహాలో ఈ వీడియో ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. గత తొమ్మిదేళ్ల పాలనలో భారత్ను బీజేపీ తన విధానాలతో ఎలా విధ్వంసం చేసిందనే దానిపైనే తన ప్రసంగం ఉంటుందని స్టాలిన్ చెప్పారు. దేశ భవిష్యత్ బాగుండాలంటే ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వరాదని సూచించారు. 2024 లోక్సభ ఎన్నికలు దేశంలో బీజేపీ పాలనకు ముగింపు పలుకుతాయన్నారు. ఇండియా కూటమి సమానత్వం, సౌభ్రాతృత్వం సూత్రాలను పాటిస్తుందని పేర్కొన్నారు. కాగా ఇండియా కూటమి ఆలోచనలను దేశంలోని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి స్టాలిన్ ప్రారంభించిన ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఇంగ్లీష్తో ఇతర భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది.