హైదరాబాద్ జవహర్ నగర్ బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్

హైదరాబాద్ జవహర్ నగర్ బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలి: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
  • (మహిళా కమిషన్ కార్యాలయం-హైదరాబాద్)

ముద్ర, హైదరాబాద్: హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్  అండగా నిలుస్తోందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాద్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఛైర్ పర్సన్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి, కమిషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి శారద బాధితురాలిని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సఖి ప్రతినిధులను ఆదేశించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, రాష్ట్ర మహిళా కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

నిందితుడిపై కటిన చర్యలు తీసుకునేలా చూస్తామని ధైర్యం కల్పించారు. నిందితుడి అరెస్టు విషయంలో తక్షణమే పోలీస్ స్పందించారని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలందరికీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు. తల్లి స్థానంలో ఉండి ఒక మహిళే ఘోరాన్ని ఆపకుండా నిందితుడికి సహకరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో పరిసర ప్రాంత ప్రజలు ప్రేక్షకపాత్ర వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, స్థానికులు తక్షణమే స్పందించి ఉంటే యువతికి రక్షణ కల్పించినవారయ్యే వారని సునీతాలక్ష్మారెడ్డి గుర్తు చేశారు.