మోడీ’ పాలననే కోరుకుంటున్నారు

మోడీ’ పాలననే కోరుకుంటున్నారు
  •  తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలి
  • ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి
  • కర్నాటకలోని తెర్దాల్‌ ఎమ్మెల్యే సిద్దు సవాడి

ముద్ర ప్రతినిధి, జనగామ: దేశ ప్రజలు మూడో సారి కూడా మోడీ పాలననే కోరుకుంటున్నారని కర్నాటకలోని తెర్దాల్‌ ఎమ్మెల్యే సిద్దు సవాడి అన్నారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్‌ యోజన’ కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా జనగామ నియోజకవర్గంలో పలు మండలాల్లో పర్యటించిన ఆయన శనివారం ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డితో కలిసి మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలు, ఆయన అందిస్తున్న సుస్థిర పాలనే కారణంగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌ రాక్షస పాలన కొనసాగిస్తోందన్నారు.

ఎక్కడ చూసినా భూకబ్జాలు, అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారన్నారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ అని, బూత్‌ స్థాయి నుంచి తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. తాము ఎట్టి పరిస్థితిలో బీఆర్‌‌ఎస్‌కు సపోర్ట్‌ చేయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు సైనికుళ్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్‌ యాదవ్‌, లీడర్లు సౌడ రమేశ్‌, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్‌శర్మ, పార్లమెంట్‌ కోన్వీనర్‌‌ కొంతం శ్రీనివాస్‌, కౌన్సిలర్‌‌ బొట్ల శ్రీనివాస్‌, సంపత్‌, హరీశ్‌, అశోక్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.