సంఘటిత పోరాటాలు చేయకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావు.

సంఘటిత పోరాటాలు చేయకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావు.
  • జర్నలిస్టుల ఇళ్లస్థలాల జీవోను సవరించాలి.
  • పశ్చిమగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే 36వ మహాసభల్లో  రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు డిమాండ్!

భీమవరం జనవరి 21:జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడానికి  సంఘటిత ఉద్యమాలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే , రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు అన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యలపై రాజీ లేకుండా, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోరాటం చేస్తున్నది ఒక్క  ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపీ యూ.డబ్ల్యు.జె . 36వ మహాసభ  వీరవాసరం తులసీ కన్వెన్షన్ లో ఆదివారం జరిగింది. 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు జి వి ఎస్ ఎన్ రాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐ.వి సుబ్బారావు మాట్లాడుతూ ఎ పి.యు. డబ్ల్యూ.జే. కి  పోరాటాలలో సుదీర్ఘచరిత్ర ఉన్నదని , రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి ఇప్పటివరకు అనేక సమస్యలపై దశలవారీగా పలుపొరాటాలు  సాగించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తరువాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సమస్యలు వివరించామన్నారు. జర్నలిస్టులు సమస్యలపై మంత్రి కాలవ శ్రీనివాసు ఆధ్వర్యంలో పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చి, తరువాత యూనియన్ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, బీమా సమస్యలు, హెల్త్ స్కీమ్ ల గురించి అన్ని పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో మహా ధర్నా కూడా చేశామన్నారు.

దాంతో విభజిత రాష్ట్రంలో హెల్త్ స్కీమును ప్రభుత్వం అనుమతించిందన్నారు.10 లక్షల ప్రమాద బీమా అమలు చేసారని, జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకానికి వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు . అయితే ఎన్నికలు రానున్న తరుణంలో  ప్రభుత్వం చివరి రోజుల్లో కార్యాచరణ చేపడతంతో ఫలితాలు దక్కలేదని అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే విధంగా ప్రభుత్వ దృష్టికి జర్నలిస్టులు సమస్యలను వివరించే  కార్యక్రమం చేపట్టమన్నారు. 2019 జూన్  13న ముఖ్యమంత్రిని కలిసామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రకటించిన గృహ పథకాన్ని  పక్కనపెట్టి తమ ప్రభుత్వం ఉగాది నాటికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తుందని జగన్ చెప్పారని, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులకు పెన్షన్ స్కీము ప్రవేశ పెడతామని  హామీ ఇచ్చారని , అయితే నాలుగున్నరేళ్ళు గడిచినా అమలు జరగలేదన్నారు. మళ్లీ ఇప్పుడు జర్నలిస్టులందరికీ 40 ,,60 శాతం వాటాతో ఇంటి స్థలాలు ఇస్తామని జీఓ ఇచ్చారని త్వరలో  సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో యంత్రాంగమంతా వారి పనిలో పడ్డారని, ఇక జర్నలిస్టుల ఇంటిస్థలాల సమస్య ఏమేరకు  పరిష్కారం అవుతుందో సందేహంగా ఉందన్నారు.

జర్నలిస్టుల సమస్యలను తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని పార్టీల నాయకులను , స్థానిక ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేయాలని,అందుకు  హామీ తీసుకోవాలని జర్నలిస్టులను కోరారు కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని 10384 ఆన్ లైన్ సంతకాలతో వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయింది అన్నారు .కఠినమైన  నిబంధనల వల్ల చాలా మంది  అక్రిడేషన్లు   కోల్పోయారని అన్నారు. అడ్డగోలు నిబంధన వల్ల గృహ నిర్మాణ స్కీముకు కూడా అందరూ దూరమయ్యారని వాపోయారు. ఈ ప్రభుత్వ హయాంలో కూడా అనేక దౌర్జన్యాలు, అక్రమ కేసులు, మాఫియాల దాడులు జరిగాయని, విలేకరులపై కేసులు పెట్టారని అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నామని  అన్నారు.

ఐజెయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాలతో ఏపీయూడబ్ల్యూజే 1957లో ఏర్పడిందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ పితామహుడు మానికొండ చలపతిరావు చేతుల మీదుగా ఆవిర్భవించిన సంఘానికి జిల్లాకు చెందిన  మంగళంపల్లి చంద్రశేఖర్ సారథ్యం వహించారన్నారు. దేశంలో ఐజేయు లో 35 వేల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని జర్నలిస్టుల సంక్షేమానికి హక్కుల కోసం ముందు నిలిచి పోరాడుతున్నదని  అన్నారు. సమస్యల పరిష్కారం కోసం  సంఘటితంగా  జర్నలిస్టులు పోరాడాలని అన్నారు. యాజమాన్యాల కోసం  తమ వృత్తి కొనసాగిస్తున్నా తమ వృత్తి భద్రత కోసం , వృత్తి గౌరవం కోసం ,  విలేకరులు తమను తామును రక్షించుకునేందుకు పోరాటం చేయాలన్నారు, దేశంలోని పలు  రాష్ట్రాల్లో రిటైరయిన  జర్నలిస్టులకు ఫించను అందజేస్తున్నారని మన రాష్ట్రంలో ఆ సదుపాయాన్ని సాధించుకోవాలని అన్నారు.

ప్రమాద భీమాను ,రైల్వేలో జర్నలిస్టుల రాయితీలను  పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విలువలతో కూడిన వృత్తి చేయాలని, వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుని వ్యక్తిగత  ప్రతిష్టతో పాటు యూనియన్ పటిష్టతను పెంచాలని కోరారు. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని, జాతీయ పత్రికా దినోత్సవాన్ని  ప్రతిఏటా  నిర్వహించాలని కోరారు.ఐజేయు జాతీయ కౌన్సిల్  సభ్యుడు షేక్ బాబు మాట్లాడుతూ జర్నలిజంలోకి యువత ఎక్కువగా వస్తున్నదని చెప్పారు. వారు జర్నలిజం వృత్తి విలువను,యూనియన్  పోరాట చరిత్రను, సమస్యల పరిష్కారాలను, వాటికై  పోరాటం చేయాల్సిన అవసరాన్ని  తెలుసుకోవాలని కోరారు. ఎన్నో యూనియన్లు వస్తున్నాయి వెళుతున్నాయని, కానీ ట్రేడ్ యూనియన్ పద్దతిలో ప్రతి ఏట వార్షిక  రిటర్న్ లను కార్మిక శాఖకు   సమర్పిస్తున్నది ఒక ఏపీయుడబ్ల్యుజే మాత్రమే అన్నారు.


చిన్న, మధ్య తరహా పత్రికల  అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సి.హెచ్. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పత్రిక మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు. అయినప్పటికీ చాలా కొత్త పత్రికలు వస్తున్నాయన్నారు. నిబంధనల పేరుతో చిన్న పత్రికలకు  అక్రిడేషన్ల మంజూరుకు తీవ్ర అవరోధం కలిగిందన్నారు.  చిన్న పత్రికల మనుగడ కోసం , వాటి రక్షణకు,  ఏపీయుడబ్ల్యుజే అండగా ఎంతో పోరాటం చేస్తున్నదని, అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకుందామని కోరారు.విజయవాడ ప్రెస్ క్లబ్ సీనియర్ నాయకుడు దారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం విలేకరులపై దాడులు జరిగితే వారికి ప్రత్యేకంగా ఒక  రక్షణచట్టం లేకుండా పోయిందన్నారు. ఇందుకోసం  కృషి చేద్దామన్నారు. మీడియాపై పాలకులే దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. జర్నలిస్టులయూనియన్లు ఎన్నో పుట్టుకొస్తున్నాయని, అయినా   జర్నలిస్టుల హక్కులను కాపాడుతున్న సంఘం మనదేనన్నారు.

పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ జిల్లా విభజన తరువాత కొత్త జిల్లాల్లో  యూనియన్ పటిష్టతకు కొత్త కమిటీలు కృషి చేయాలని , సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని కోరారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ వార్తల సేకరణకు విలేకరులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుర్తు చేసుకున్నారు. పోరాటం చేయగలిగిన వారే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అన్నారు. విలేకరుల గురించి యాజమాన్యాలు పట్టించుకోకపోయినా పాలకులు ఇబ్బందులు పెడుతున్నా, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా , ఉద్యోగ జీవితానికి భద్రత లేకపోయినా  పాత్రికేయ వృత్తిలో వారు  కొనసాగుతున్నారని అన్నారు. వారి సమస్యలను తమ పార్టీ నాయకత్వం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టు యూనియన్ నాయకుల గురించి తన సానిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ తాను విద్యార్థి ఉద్యమం తర్వాత పత్రికా రంగంలో 25 ఏళ్లు పైగా జర్నలిస్ట్ గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వృత్తి సవాళ్ల ను జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు వారి సమస్యలతో పాటు నైతిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ఈ సమస్యలకు పోరాటం చేయాలని తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. వీరవాసరం మండల పరిషత్ అధ్యక్షురాలు వీరవల్లి దుర్గాభవాని మాట్లాడుతూ  స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. విలేకరులు ఎంతో కష్టపడి వార్తలు రాస్తున్నారని అన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాల మంజూరులో ఎన్నో కఠినమైన నిబంధనలు విధించడం వల్ల చాలామందికి  ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన చెందారు. యాజమాన్యాలు కూడా విలేకరుల సమస్యలను పరిష్కరించడానికి పట్టించుకోవాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను కూడా చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, విలేకరులకు ఇంతవరకు సరైన న్యాయం జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని ఎన్నో నిబంధనలు విధించడం దారుణం అన్నారు.ఏఐటియుసి జిల్లా నాయకుడు  చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ విలేకరుల భద్రతకు  రక్షణ చట్టాలు అవసరమని, వారు  అణచివేతకు గురవుతున్నారని వాపోయారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మహాసభల నిర్వహణకు పూర్తి సహకారం అందించిన వీరవాసరం జర్నలిస్టు గోపాలకృష్ణను,తులసి కన్వెన్షన్ సెంటర్ యజమాని మళ్ళ రాంబాబును, ఘనంగా సత్కరించారు. తొలుత ఇటీవల కన్నుమూసిన  పాత్రికేయులకు నివాళులర్పించారు.ఎటువంటి వివాదం లేకుండా జిల్లా యూనియన్ ఎన్నికలను  నిర్వహించడానికి సహకరించిన సభ్యులకు  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ.వి. రామరాజు ధన్యవాదాలు వివరించారు.

ఈ సమావేశంలో ఏపీయుడబ్ల్యుజె ఉమ్మడి జిల్లా శాఖ  కార్యదర్శి వి ఎస్ సాయిబాబు, కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ గజపతి వర ప్రసాద్, భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కేవీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాలనుండి రెండు వందల యాభై మంది పాత్రికేయులు హాజరయ్యారు.