డబ్ల్యూటీసీకి బైజూస్ టాటా
- మార్కెటింగ్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్ణయం
- కొత్త లీడ్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట
ముంబై: మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకునేందుకు డబ్ల్యూటీసీ లీడ్ స్పాన్సర్ల నుంచి ప్రముఖ కంపెనీ బైజూస్ తప్పుకుంది. దీంతో కొత్త లీడ్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట మొదలు పెట్టింది.
టూల్ కిట్ స్పాన్సర్గా ఆదిదాస్ కంపెనీతో బీసీసీఐ కొత్త డీల్ చేసుకుంది. ఐదేళ్ల పాటు ఈ డీల్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్గా కూడా ఎక్కువ కాలం ఉండే కంపెనీలతోనే డీల్ చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికోసమే తాజాగా టెండర్లు విడుల చేసింది. ఇవి కొనుగోలు చేసే కంపెనీలు.. టీమిండియా స్పాన్సర్షిప్ కోసం పోటీ పడతాయి. 'స్పాన్సర్షిప్పై ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఐటీటీ (టెండర్) కొనుగోలు చేసి బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లో అర్హతలన్నీ కలిగిన కంపెనీలు, మిగతా నిబంధనలను పాటించే కంపెనీలకే ఈ బిడ్లో పాల్గొనే అర్హత ఉంటుంది. కేవలం ఐటీటీ కొనుగోలు చేస్తే.. బిడ్ వేస్తారని, వేసేందుకు అర్హత సాధిస్తారని అనుకుంటే పొరపాటే' అని బీసీసీఐ తెలిపింది.
అయితే ఈ బిడ్ వేయడంలో కొన్ని కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్లు కూడా బీసీసీఐ తెలిపింది. స్పోర్ట్స్వేర్ మానుఫ్యాక్చర్లు, ఆల్కహాల్ ఉత్పత్తులు, బెట్టింగ్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ సంస్థలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ మినహా రియల్ మనీ గేమింగ్ వేదికలు, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లు, పోర్నోగ్రఫీ వంటి అఫెన్సివ్ కంటెంట్కు సంబంధించిన కంపెనీలు తదితరాలు ఈ స్పాన్సర్షిప్కు అనర్హులని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ ఏడాది చివరలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్షిప్ కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని వల్ల తమ కంపెనీలకు మంచి ఎక్స్పోజర్ దొరుకుతుందని సందరు కంపెనీలు భావిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టూర్కు ముందే స్పాన్సర్ను సెలెక్ట్ చేసుకోవాలని బీసీసీఐ చూస్తోంది. ఈ టూర్ నుంచి భారత జెర్సీపై కొత్త స్పాన్సర్తో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.